
నేటి నుంచి ఇంటర్ తరగతులు
● మొదటి సంవత్సరంలో కొనసాగుతున్న అడ్మిషన్లు ● ఇంకా ప్రభుత్వ కళాశాలలకు చేరని పాఠ్యపుస్తకాలు ● మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని విన్నపం
కొత్తగూడెంఅర్బన్: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కళాశాలలను శుభ్రం చేసి, సిద్ధం చేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి తెలిపారు. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా కళాశాలలు ప్రారంభమవుతున్నా పాఠ్య పుస్తకాలు ఇంతవరకు కళాశాలలకు చేరుకోలేదు. ఏటా కళాశాలల ప్రారంభం తర్వాతే అరకొరగా పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు సీనియర్ల పుస్తకాలు అడిగి చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న విద్యార్థుల కోసం మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు విన్నవించారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు 14, ప్రైవేటు కళాశాలలు 30 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,900 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, రెగ్యులర్ లెక్చరర్లు 160, కాంట్రాక్టు లెక్చరర్లు 11, గెస్ట్ లెక్చరర్లు 27, నాన్ టీచింగ్ స్టాఫ్ 65 మంది ఉన్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో గతంలో గెస్ట్ లెక్చరర్లుగా పని చేసిన వారిని, లెక్చరర్ల సంఖ్య తక్కువ ఉన్న చోట మళ్లీ తీసుకోవచ్చని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది లెక్చరర్ల కొరత ఉండదని, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలని ఇంటర్మీడియట్ అధికారులు కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. సుదూరప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు వినతిపత్రం కూడా అందించాం.
–ఎం.ఖుర్షీద్ అహ్మద్, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
అడ్మిషన్లు పొందాలి
జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. నేటి నుంచి కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాలలను ఇప్పటికే సిద్ధం చేశాం. పాఠ్య పుస్తకాల కోసం ప్రతిపాదనలు పంపించాం.
–హెచ్.వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి

నేటి నుంచి ఇంటర్ తరగతులు

నేటి నుంచి ఇంటర్ తరగతులు