ప్రకటించిన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ. కోటి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అధికారులు శుక్రవారం హైదరాబాద్లో వివరాలు వెల్లడించారు. ఈ నిధులతో మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల భద్రాచలం పర్యటనలో ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించి, రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏలలో ట్రైబల్ మ్యూజియాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
భూసేకరణపై గ్రామసభ
మణుగూరురూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం భూసేకరణ చట్టం ప్రకారం శుక్రవారం తిర్లాపురంలో పీసా గ్రామసభ నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ హాజరై.. భూములు కోల్పోయే వారికి సింగరేణి పరిహారం అందిస్తుందని, సింగరేణి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇప్పటికే తమలో చాలామంది ఓసీ విస్తరణలో భూములు కోల్పోయారని తెలిపారు. తమకు మెరుగైన నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే ఇచ్చే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. పరిహారంపై స్పష్టమైన ఒప్పంద హామీ ఇవ్వకపోవడంతో గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించి వెళ్లిపోయారు. సభలో తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు, పీకేఓసీ పీఓ లక్ష్మీపతిగౌడ్, ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఫాస్ట్ ఫుడ్తో అనారోగ్యం
జూలూరుపాడు: ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని యునాని డాక్టర్ రాజేందర్ అన్నారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జూలూరుపాడులో యోగాపై అవగాహన నిర్వహించారు. రాజేందర్ మాట్లాడుతూ.. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయసులో ఊబకాయం, కంటి చూపు మందగించడం, గుండె జబ్బు, కిడ్నీ వ్యాధుల బారినపడతారని చెప్పారు. యోగాసనాలు, ధ్యానంతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వేల్పుల బోసు, బండ్ల వెంకటేశ్వర్లు, తిప్పర్తి శివ, పెండ్యాల నరేశ్, తాళ్లూరి నవీన్, నరేశ్చౌదరి, బసవయ్య, రజనీకాంత్, కోటయ్య పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
సింగరేణి(కొత్తగూడెం): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఏజీఎం పర్సనల్ (వెల్ఫేర్) గడిపెల్లి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రకాశం స్టేడయంలో వర్క్పీపుల్ స్పోర్ట్స్, గేమ్స్ ఆధ్వర్యంలో నెలరోజులుగా సాగిన సమ్మర్ కోచింగ్ క్యాంపు శుక్రవారంతో ముగియగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజీఎం మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంత బాల, బాలికలు ఇక్కడ నేర్చుకున్న క్రీడల్లో నిరంతరం తర్ఫీదు పొందుతూ ఉండాలని చెప్పారు. అనంతరం సర్టిఫికెట్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రమణమూర్తి, పీతాంబరరావు, కట్టా బసవయ్య, కోడూరు శ్రీనివాస్రావు, టి.శ్రీనివాస్రావు, పాసినెట్ పాల్గొన్నారు.
చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్తగూడెంఅర్బన్: పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ అధ్యక్షతన గర్భధారణ, ప్రసవానికి ముందు రోగ నిర్ధారణ పద్ధతులు, చట్టంపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ..అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో గర్భిణి సంసిద్ధత, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి రిఫరల్, ఆధార్కార్డు కాపీని ఫారంతో జతచేయాలని పేర్కొన్నారు. వైద్యులు అనూష, ఎండీ అస్గర్హుస్సేన్, ఎం.సునీత, రాజమణి, స్పందన, ఫైజ్మోహియుద్దీన్ పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడు రిమాండ్
టేకులపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. టేకులపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.

గిరిజన మ్యూజియానికి రూ. కోటి