
నమ్మించి నయవంచన
● మాన్యువల్ కౌన్సెలింగ్పై మాట తప్పిన విద్యాశాఖామంత్రి లోకేష్ ● వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం ● ఉపాధ్యాయుల ముట్టడితో దద్దరిల్లిన ప్రకాశం భవన్ ● వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు ● రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఒంగోలు సిటీ: ఎస్జీటీ, పండిట్లు, పీఈటీల బదిలీలను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని మాట ఇచ్చిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నమ్మించి మోసం చేశారని, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా గేట్లు వేశారు. ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దనరెడ్డి అధ్యక్షత వహించారు. కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తామని హెచ్చరించారు. ఇది చరిత్రలో రుజువైన సత్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 13,777 ఎస్జీటీలకుగాను 177 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారు కూడా అధికారుల ఒత్తిడి వల్లే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం అత్యంత హేయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జరిపిన చర్చల్లో ఎస్జీటీలకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నమ్మించి మాట తప్పిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఎప్పటికీ మాన్యువల్ కౌన్సెలింగే కావాలని, వెబ్ కౌన్సెలింగ్ వద్దని తేల్చి చెప్పారు. అయితే మాన్యువల్ కౌన్సెలింగ్ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని, జిల్లా స్థాయిలో డీఈఓ, ఎంఈఓలకు వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జేడీ చెబుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరూ ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని నమ్మబలుకుతున్నారని, దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఎవరూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవద్దని సూచించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీ, పీఈటీ, పండిట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సీనియారిటీ జాబితాలో ఉన్న లోపాలను సరిచేసి ఫైనల్ జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రతినిధి చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీయూఎస్ రాష్ట్ర ప్రతినిధి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నాయకులతో చర్చించాలని కోరారు. ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.కీర్తి మాట్లాడుతూ ఉద్యమం బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బీటీఏ రాష్ట్ర ప్రతినిధి పర్రె వెంకటరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు షేక్ అబ్దుల్ హై, వీరాంజనేయులు, రవి, కె.ఎర్రయ్య, బి.వెంకటరావు, లక్ష్మీనారాయణ, డి.శ్రీనివాసులు, దిలీప్కుమార్, మాధవరావు, వై.వెంకటరావు, హిమజ, పులి శ్రీను, ఎన్. అంజిరెడ్డి, పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డీఈఓ కిరణ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.