
భావన్నారాయణ బహుముఖ ప్రజ్ఞాశాలి
బాపట్ల:బీఎంఎస్ ఆలిండియా వ్యవస్థాపక అధ్యక్షులు, స్వయం సేవకులు స్థానం భావనారాయణ వివిధ క్షేత్రాలలో విశేష సేవలు అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. బాపట్ల రోటరీ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం స్థానం భావనారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత స్థానం భావనారాయణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు ప్రముఖ స్వయంసేవక్ నేత శ్యాం ప్రసాద్ అధ్యక్షత వహించి స్థానం భావనారాయణతో నాలుగు దశాబ్దాలపాటు కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. బీజేపీ నాయకుడు ఆర్ లక్ష్మీపతి మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో పుట్టి భావనారాయణ స్వామి దేవాలయ చైర్మన్గా, వంశపారంపర్య ధర్మకర్తగా, స్వయంసేవకుగా, శిశుమందిర్ నిర్వహకులుగా వివిధ క్షేత్రాలను పనిచేసే లక్షలాదిమందికి మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. బావన్నారాయణ సోదరుడు ఎస్బీఎస్ తిలక్ మాట్లాడుతూ బావన్నారాయణ బాల్యం నుండి అంతర్జాతీయ వేదికలలో చేసిన ప్రసంగాల వరకు ఆయన జీవిత ప్రస్థానాన్ని వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి బంగారు బాబు మాట్లాడుతూ స్వయంసేవకునిగా జీవితాన్ని ప్రారంభించి జేనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశ గళాన్ని అద్భుతంగా వినిపించిన కార్యసాధకుడు భావన్నారాయణ అని కొనియాడారు. సీబీఐ న్యాయవాది మన్నవ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ బాపట్ల ఖ్యాతిని దేశ వేదికలపైనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా వినిపించి ఎందరికో ప్రేరణగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో వల్లూరి భావనారాయణ, పార్థసారథి, బొమ్మిశెట్టి బాలాజీ, బూరెల రత్తయ్య, మన్నవ బాలాజీ, జగన్నాధశాస్త్రి, డాక్టర్ శ్రీనివాస్, లేల సుధాకర్, లేళ్ల వెంకటప్పయ్య, మెండు రజిని, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్