
అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతి
విగ్రహావిష్కరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు
తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని కొల్లిపర మండల గ్రామం తూములూరు శివారు క్రిస్టియన్పాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఏర్పాటుచేసిన నిలువెత్తు విగ్రహాన్ని శనివారం రాత్రి సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ ఆవిష్కరించారు. సభకు విగ్రహ కమిటీ అధ్యక్షుడు కనపర్తి మోహనరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ, విద్యకు ప్రాముఖ్యత నివ్వాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందనీ, ప్రతిఒక్కరు చదువుకోగలిగినప్పుడు సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ తన ప్రసంగంలో దళితులు కుర్చీల్లో కూర్చోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో రాజ్యాధికారం సాధించుకోవాల్సి ఉందన్నారు. అందుకు అంబేడ్కర్ విగ్రహం స్ఫూర్తి కావాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు.
విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి బొనిగల రామారావు మాట్లాడుతూ దళితులు, బలహీనవర్గాల ప్రజలే చరిత్రను నిర్మించినవారని గుర్తుచేశారు. భాషను కనుగొన్నది కూడా వాళ్లేనని చెప్పారు. దళితవాడల నుంచి ఎందరో మేధావులు, విద్యావంతులు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కులవివక్ష పోరాట కమిటీ నాయకుడు ఉన్నవ వినయ్కుమార్ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను సోదాహరణంగా వివరించారు. వివక్షత నుంచి విముక్తులు కావాల్సి ఉందన్నారు. కనపర్తి బెనహర్ తన ప్రసంగంలో, కొల్లిపర ప్రాంతానికి చెందిన దళిత ఉద్యమనేత కనపర్తి ఏసురత్నం బాటలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. విగ్రహ కమిటీ కన్వీనర్ తెనాలి మోహనరావు, కనపర్తి అబ్రహాం లింకన్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్, బేతాళ భూషణం, యండ్రపాటి సాంబయ్య, సిద్దెల అబ్రహం, యండ్రపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.