
అపార్టుమెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో నిర్మాణంలో వున్న ఒక అపార్టుమెంట్ పై నుంచి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పట్టణ సీఐ కల్యాణ్రాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు సప్తపదిలోని విద్యానగర్కు చెందిన గండు జగదీష్ (35) గుర్తించారు. ఇతను తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వచ్చి ఐదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకాడని, తలకు తీవ్రమైన గాయం ఏర్పడిందని, కొన ఊపిరితో ఉండడంతో భవనంలో పనిచేస్తున్న పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా జగదీష్ మృతి చెందినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. జగదీష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ బంధువులు మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి జగదీష్తో సన్నిహితంగా ఉండే బంధువులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కారణం చేతే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారే హత్య చేసిఉంటారేమోననే దిశలో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం బిల్డింగ్పై నుంచి దూకినట్లు తెలిపారు. జగదీష్ తమ్ముడిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఇప్పడు ఏమీ చెప్పలేనని, మా అన్నయ్యది ముమ్మాటికీ హత్యేనని, పోలీస్స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు.
చనిపోయేటట్లు ప్రేరేపించారని ఆరోపిస్తున్న బంధువులు