
ప్రకృతి వ్యవసాయమే రైతులకు దిక్సూచి
నరసరావుపేట రూరల్: రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామాల్లో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళీ తెలిపారు. వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్వవసాయ విభాగం ఆధ్వర్యంలో సమన్వయంతో మూడో రోజు శిక్షణా కార్యక్రమం శనివారం బృందావన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మురళీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్ధితుల్లో రైతులందరూ రసాయనాలు వీడి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి పాల్గొన్న రామచంద్రన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడమే శరణ్యమని తెలిపారు. ప్రతి రైతు 30 రకాల విత్తనాలతో పీఎండీఎస్ విధానాన్ని ఆచరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా భూమికి అన్ని రకాల సూక్ష్మజీవులు అందుబాటులోకి రావడంతో పాటు భూమి ఉత్పాదక శక్తి పెరుగుతుందన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ 28 మండలాల్లో132 గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వ్యవసాయం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది 82,619 ఎకరాల విస్తీర్ణం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పీఎండీఎస్ కిట్స్ అందుబాటులో ఉన్నాయరని, రైతులు కిట్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంట సాగు చేస్తే మార్కెట్ ధర కన్నా అధిక ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమరాజు, మండల వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.