
జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: రేపల్లె పట్టణంలోని 18వ వార్డు అరుంధతీనగర్ సమీపంలో ఏర్పడిన జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న కాలనీవాసులు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను విన్నవించారు. రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం పడినా నివాస గృహాల మధ్య రోజుల తరబడి నీటి నిల్వలు ఉండటంతో దోమల బెడద, దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో విషసర్పాల బెడద అధికమైందని వివరించారు. అప్పులు చేసి గృహాలు నిర్మించుకున్నా కనీస వసతులు లేక ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి బోర్లు మరమ్మతుకు గురై తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించలేదన్నారు. సమస్యలపై పలుమార్లు అధికారులకు వినతిపత్రం అందించటం, కార్యాలయం వద్ద నిరసనలు తెలియజేసినా ఫలితం శూన్యమని గోడు వెళ్లబోసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయింపులు చేస్తామన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్, జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి.ధనమ్మ, కో కన్వీనర్ రవికుమార్, సహాయ కార్యదర్శి నాంచారమ్మ, సభ్యులు శ్రీనివాసరావు, వీరాంజనేయులు, గోపి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అనగానికి కాలనీవాసుల వినతి