
పొగాకు రైతులను విస్మరించిన కూటమి ప్రభుత్వం
యర్రంవారిపాలెం (కారంచేడు): ఈ ఏడాది పొగాకు సాగు చేసిన రైతులను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం యర్రంవారిపాలెంలో తనను కలిసేందుకు వచ్చిన స్థానిక పొగాకు రైతులు, విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో కొంత మేర బ్లాక్ బర్లీ, దొర పొగాకు సాగు చేశారన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పొగాకు సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం కౌలు రైతులేనన్నారు. పొగాకు రైతుల పక్షాన పోరాడతానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద మంత్రుల బృందం పర్యటించి పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించిందని తెలిపారు. అయితే నెల అవుతున్నా ఇంత వరకు పొగాకు రైతుల కన్నీరు తుడవలేకపోయారన్నారు. 89 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తే ఇప్పటికి కేవలం 25 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పట్టీ పట్టనట్లు దోబూచులాడుతున్నారన్నారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడానని సీఎం చంద్రబాబు మాటల్లో నిజాయతీ లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొనేంత వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా వెంటనే బర్లీని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పొగాకును మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు.
యర్రం లక్ష్మారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పోలూరి శివారెడ్డి, భవనం రాజగోపాల్రెడ్డి, భవనం వెంకటేశ్వరెడ్డి, మనుబోతు వెంకటరెడ్డి, గుదిబండి అంజిరెడ్డి, పమ్మి వెంకటరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి