
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ముఖ్యం
బాపట్ల: ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయాధికారులకు, ఉద్యాన శాఖ అధికారులకు మూడు రోజులపాటు కొనసాగిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రకృతి వ్యవసాయంపై దశలవారీగా అవగాహన కల్పించాలని సూచించారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు అవగాహన పెంచాలని తెలిపారు. రసాయనిక ఎరువులు వాడకంతో అనర్థాలు వివరించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ మాట్లాడుతూ సేంద్రియ సాగుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలన్నారు. పెరటి కూరగాయల పెంపకంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్రస్థాయి అధికారులు రామచంద్రం, భాగ్యలక్ష్మి, అడిషనల్ డీపీఎం మోహన్ తదితరులు పాల్గొన్నారు.