
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
తెనాలి ముత్తెంశెట్టిపాలెం కేసును ఛేదించిన పోలీసులు
తెనాలి రూరల్: తెనాలి ముత్తెంశెట్టిపాలెంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ముత్తెంశెట్టిపాలెంలో తాడిపత్రి మల్లీశ్వరి టిఫిన్ బండి నిర్వహిస్తూ ఒంటరిగా జీవిస్తోంది. కుమార్తె, కుమారుడికి వివాహాలయ్యాయి. వారు ఇదే ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న మల్లీశ్వరి బంగారు ఆభరణాలను ధరించి ఉండడాన్ని ఆమె ఇంటి పక్కనే నివసిస్తున్న 24 ఏళ్ల నన్నెపాముల తారక జోషి గమనించాడు. ఇతడు గతంలో బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామంలో నివసించేవాడు. వివాహమై, చెడు వ్యసనాలతో అప్పులపాలైన అతను ఆ ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తమ్ముడు సతీష్కుమార్ సహాయం తీసుకున్నాడు. 3వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు మల్లీశ్వరి నీళ్ల కోసం పంపు వద్దకు రాగా ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఆ బంగారంలో కొంత తారక జోషి తనకు పరిచయమున్న సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన మహిళ గాజులవర్తి కీర్తికి ఇచ్చాడు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్న క్రమంలో చిక్కిన నిందితులు నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆ ఆభరణాలను ఆమె తాకట్టు పెట్టిందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును 48 గంటల్లో ఛేదించిన వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు.