
నల్లబర్లీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
మంత్రి గొట్టిపాటికి రైతుల వినతి
జె.పంగులూరు: మండల కేంద్రమైన పంగులూరు గ్రామంలోని మార్కెట్ యార్డులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు రైతులు విజ్ఞప్తి చేశారు. మండలంలోని చందలూరు గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన్ను పలువురు పొగాకు రైతులు కలిశారు. మండలంలో సుమారు 43 వేల క్వింటాళ్ళకు పైగా నల్లబర్లీ పొగాకు నిల్వ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో అధికంగా పొగాకు నిల్వలు ఉనందున ఆ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంగులూరు పరిసర ప్రాంతాల గ్రామ రైతులు పొగాకు నిల్వలను విక్రయించుకునేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రైతులు అడ్డగద సతీష్, అడ్డగడ సుబ్బయ్య, కర్రి వెంకటసుబ్బారావు, రావూరి రమేష్ బాబు, ఎన్టీర్ వెంకటేశ్వర్లు, నార్వే శ్రీనివాసరావు, కుక్కపల్లి ఏడుకొండలు తదితరులు ఉన్నారు.
మొక్క నాటిన మంత్రి
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండలంలోని చందలూరులో వన మహోత్సవం సందర్భంగా మొక్క నాటారు. ఎంపీడీఓ కె. స్వరూపరాణి, ఏపీఓ కె. సంతోషం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ డీఈ శ్రీనివాస్, ఏఈ శివయ్య, ఈఓఆర్డీ సుమంత్, పంచాయతీరాజ్ ఏఈ గడ్డం హనుమంతరావు పాల్గొన్నారు.