
ప్రతి ఇల్లు యోగా కేంద్రం కావాలి
ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ
గుంటూరు వెస్ట్: ప్రతి ఇల్లు యోగా కేంద్రంగా మారితే ఆ ఇంట ఆరోగ్య, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం యోగాంధ్రాలో భాగంగా స్థానిక బృందావన్గార్డెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ మేయర్ షేక్ షజిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శారీరక, మానసిక ప్రయోజనాలు కలిగించే యోగాపై ప్రజలు విస్తృతంగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు.