
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
అద్దంకి రూరల్: సరిగ కర్రల తోటలో గుర్తు తెలియని మృతదేహం అద్దంకి మండలంలో మంగళవారం లభ్యమైంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి –నార్కెట్పల్లి నామ్ రహదారిపై మండలంలోని శాంతినగర్ గ్రామ పొలాల్లోని సరిగ తోటలో గుర్తు తెలియని మృతదేహం చెట్టుకు వేలాడుతుండటం గమనించిన స్థానిక రైతులు సీఐకి సమాచారం ఇచ్చారు. వ్యక్తి నాలుగు రోజుల కిందట మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లి పోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉందని సీఐ తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని వివరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటం గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం ఇద్దరు మహిళలు అక్కడ అనుమానంగా తిరుగుతుండడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఇప్పటం గ్రామానికి చెందిన పోతగాని గోపి వేసవి సెలవులకు వేరే ఊరు వెళ్లారు. పక్కనే ఉండే గోపి తమ్ముడు పులి మనోజ్ ఇక్కడే ఉన్నారు. గోపి ఇంటి తాళాలు పగలకొట్టి ఉండడం, అక్కడే ఇద్దరు మహిళలు ఉండడంతో వారిని అనుమానించి పోలీసులకు అప్పగించారు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.10 వేలతో పాటు వాచ్ పోయిందని గోపి ఫిర్యాదు ఇచ్చారు. సదరు మహిళలు మాత్రం తాము రైల్వే ట్రాక్ వెంబడి ప్లాస్టిక్ డబ్బాలు సేకరిస్తుంటామని, చోరీ చేసే ధైర్యం లేదని, తాగునీరు పట్టుకుని ఇంట్లో జామకాయలు కోస్తుండగా పట్టుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ దొంగతం చేస్తే ఆ డబ్బు, వస్తువులు తమ వద్ద ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభను జయప్రదం చేయండి
సంఘం జిల్లా అధ్యక్షుడు చినరామిరెడ్డి
నరసరావుపేటఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 5వ తేదీన విజయ వాడలో తలపెట్టిన 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభను జయప్రదం చేయాలని సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి కోరారు. సంఘం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, పార్ట్టైమ్ ఉద్యోగులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించటంతోపాటు సమావేశానికి హాజర య్యే ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.