
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండం కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. బాపట్ల మండలం గుడిపూడికి చెందిన వెంపరాల ఆంజనేయులు (45), వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు(డ్రైవర్) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు కిలేశపురం వద్ద అదుపుతప్పి ముందువెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ముందుసీటులో కూర్చున్న వెంపరాల ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన నవీన్, ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రెండు 108 అంబులెన్సుల్లో, ఒక హైవే టోల్గేట్ అంబులెన్స్లో విజయవాడ వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒకరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు తిరుపతమ్మ దర్శనానికివెళ్లొస్తుండగా ప్రమాదం

టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు