
బంగారు నగలకు మెరుగు పెడతామంటూ..
సుండుపల్లె : బంగారు నగలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు యువకులు మోసం చేసిన సంఘటన సుండుపల్లె మండలం కురవపల్లెలో జరిగింది. వివరాలు ఇలా.. గ్రామంలోని రమేష్ ఇంటి వద్దకు శనివారం బీహార్కు చెందిన ఇద్దరు యువకులు వచ్చి బంగారు నగలకు మెరుగు పెడతామంటూ నమ్మబలికారు. దీంతో వారు బొట్టుగొలుసును ఇవ్వగా ఒక ద్రావణంలో బంగారాన్ని కరిగించుకొని పరారయ్యారు. అనంతరం పెదినేనికాల్వ గ్రామ పంచాయతీ మన్యంవారిపల్లెకు చెందిన నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి బంగారం మెరుగుపెడతాం అని వారిని కోరగా వాళ్లు నిరాకరించారు. అదే గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేస్తుండగా శబ్దం రావడంతో గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మూడు, నాలుగు రోజుల క్రితం కమ్మగుట్టపల్లె, సానిపాయిలోని కొన్ని ఇళ్లల్లో నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు సమాచారం.
బీహార్ యువకులకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు