
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ అవసరాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి ఎదురుచూసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ(పీడీఈ) సిస్టమ్ ద్వారా, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా, అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదా అవడంతో పాటుగా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాలు తగ్గుతాయన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికారిక కార్యకలాపాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయన్నారు. ఏప్రిల్ 4 నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 11 సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు స్లాట్ బుకింగ్ వ్యవస్థను విస్తరించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపుల కొరతపై మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ...స్టాంపులు వచ్చాయని, అయితే వేరియేషన్స్ కారణంగా ఆన్లైన్లో ఎంటర్ చేయలేకపోతున్నామన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.