
కట్నం కోసం వేధింపు కేసులో రెండేళ్ల జైలు
పెద్దతిప్పసముద్రం : కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురి చేసిన భర్తకు తంబళ్లపల్లి న్యాయస్థానం ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని టి.సదుం పంచాయతీ గుంటిపల్లికి చెందిన ములాతి శశికళ అనే మహిళకు కర్నాటక రాష్ట్రం చింతామణి సమీపంలోని జుంజునపల్లికి చెందిన చిన్నపరెడ్డి కుమారుడు జేసీ మంజునాథ్రెడ్డి (45)తో వివాహమైంది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం తన భర్త నిత్యం కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితురాలు శశికళ 2013లో పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ ఏ.గంగాధర్ 87/2013లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కేసు తుది విచారణ కొనసాగింది. ఏపీపీ వీరాంజనేయులు వాదనలు, కేసు పూర్వాపర వివరాలు, సాక్షుల విచారణ విన్న తంబళ్లపల్లి న్యాయమూర్తి ఏ.ఉమర్ ఫరూక్ ముద్దాయి మంజునాథ్రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ బావాజాన్లు తెలిపారు.