
ఆత్మస్థైర్యంతో మహిళలు ముందుకు సాగాలి
రాయచోటి: పని ప్రదేశంలో ఏర్పడే సమస్యలను మహిళా ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో అమరావతి ఏపీజేఏసీ జిల్లా శాఖ ఏర్పాటు చేసిన షీ బాక్స్ను మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సులో మహిళా ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల సమస్యలపై షీ బాక్స్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. వాస్తవిక సమాచారం, ఆధారాలతో తమ దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ ఒక మహిళా ఉద్యోగికి ఏదైనా సమస్య వస్తే తోటి మహిళా ఉద్యోగులు అండగా ఉండాలన్నారు. అమరావతి ఏపీజేఏసీ జిల్లా చైర్మన్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, జనరల్ సెక్రటరీ వైష్ణవి మాట్లాడుతూ జిల్లాలో మూడు డివిజన్లలో తమ శాఖ సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదన్ రావు, ఏపీజేఏసీ మహిళా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్