
మెరుగైన సౌకర్యాల కల్పనకు ఆర్టీసీ కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికుల మెరుగైన సౌకర్యాల కల్పనకు అన్ని చర్యలు చేపడుతోందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. జోనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక మంగళవారం తొలిసారిగా కడపకు వచ్చిన నాగరాజుకు స్థానిక అధికారులు, యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ, ఆర్టీసీ ఆస్పత్రిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ నేపద్యంలో తమ పరిశీలనకు వచ్చిన అంశాలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు సైతం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఉమ్మడి కడపజిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రితోపాటుస్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కలిశామని, ఆర్టీసీ పరంగా ప్రయాణీకులకు సంబంధించి సమస్యలను చర్చించామని, వాటిని పరిష్కరించి మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్ఎం గోపాల్రెడ్డి, డీఎం డిల్లీశ్వరరావు, కార్గో డిప్యూటీ సీటీఎం (ఆపరేషన్స్ అండ్ కమర్షియల్) హరి, కార్గో మేనేజర్ జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్లు కన్యాకుమారి, మంజుల పాల్గొన్నారు.
ఆర్టీసీ జోనల్చైర్మన్ పూల నాగరాజు