
గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం
ఢిల్లీలో ధర్నా విజయవంతం.. పలు పార్టీల మద్దతు: మార్గాని భరత్
రాష్ట్రంలో విధ్వంసకాండను దేశం దృష్టికి తీసుకెళ్లాం: మేరుగ నాగార్జున
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో ఆయన ఉదయం 8.25 గంటలకు ఇక్కడికి విచ్చేశారు. ఇదే విమానంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, పేర్ని నాని, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దేవినేని అవినాష్ , పేర్ని కిట్టు తదితరులు వచ్చారు.
విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గం ద్వారా తాడేపల్లి చేరుకున్నారు. కాగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచక పాలనపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో చేపట్టిన ధర్నా విజయవంతమైందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ దమనకాండపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్కు మంచి స్పందన వచి్చందన్నారు.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తోపాటు పలు రాజకీయ పారీ్టల ప్రతినిధులు తమకు సంఘీభావం తెలియజేశారని చెప్పారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందన్నారు. త్వరలో ప్రధాని మోదీని కూడా కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సంఘటనలను యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సందర్భంగా ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమేనని పలు పారీ్టల నేతలు అభిప్రాయపడ్డారని తెలిపారు.