తక్కువ ఆదాయ వర్గాల వారికి ఫీజు మినహాయింపు
7 పరీక్ష పేపర్లు, 600 మార్కులు
జనరల్ సైన్స్లో రెండు పేపర్లు
సాక్షి, అమరావతి: మార్చి–2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు మార్పులను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరీక్షల్లో అంతర్గత మార్కుల వెయిటేజీ ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానం ఉంటుందని పేర్కొంది.
ఒకటో భాష, రెండో భాష, మూడో భాషా పేపర్లు, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. జనరల్ సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున ఉంటాయి. ప్రథమ భాషలో కాంపోజిట్ పేపర్–వన్ 70 మార్కులకు, పేపర్–టు 30 మార్కులకు ఉంటాయి.
పాఠశాలలు/విద్యార్థుల డేటాలో వ్యత్యాసం ఉంటే, యూడైస్ ప్లస్ డేటాలో మార్పులకు కమిషనరేట్ను సంప్రదించాలని ఆదేశించారు. ప్రైవేట్ అభ్యర్థులకు వారి ఆన్లైన్ దరఖాస్తులో మునుపటి హాజరు రోల్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
వీరికి పరీక్ష ఫీజు మినహాయింపు
పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల తడి భూమి/5 ఎకరాల పొడి భూమి మించని వారి పిల్లలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. ఇది మార్చి–2026లో తొలిసారి రెగ్యులర్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
వికలాంగులు, కేజీబీవీ విద్యార్థినులకు పూర్తి స్థాయిలో ఫీజు మినహాయింపు ఉంటుంది. 2011 సెపె్టంబర్ ముందు పుట్టిన వారు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులని, రూ.300 చెల్లించి ఏడాదిన్నర వరకు వయసు సడలింపును స్థానిక పాఠశాల హెచ్ఎం అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


