
హత్యకు పన్నాగం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో కూటమి పాలనా పగ్గాలు చేపట్టి మరో వారానికి ఏడాదవుతుంది. ఇంతలోనే ‘తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం’ విస్మయం కలిగిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారాలతో రోజుకో నేత విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమై గ్రూపులతో అట్టుడుకుతోంది.
మొన్న వెంకటేశులు.. నిన్న చంటి
ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరుపై అర్బన్ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా విభేదిస్తూ దూరమవుతున్నారు. మొన్నటికి మొన్న మినీ మహానాడులో తనను ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ సాకే వెంకటేశులు అనే వ్యక్తి పురుగుల మందు తాగారు. ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్నటికి నిన్న ఎమ్మెల్యే అనుచరులు తన ఇళ్లు కూల్చడానికి వచ్చారంటూ చంటి అనే టీడీపీ ముఖ్య నేత పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
సుధాకర్నాయుడు ఫిర్యాదు కలకలం..
మొదటినుంచి అనంతపురం అర్బన్లో టీడీపీ నేతగా సుధాకర్నాయుడుకు పేరుంది. ఈయన్ని లిక్కర్ సుధాకర్ అనికూడా అంటారు. గత కొంతకాలంగా సుధాకర్కు ఎమ్మెల్యేతో విభేదాలు నెలకొన్నాయి. జిల్లా పార్టీ పరిశీలకులు కోవెలమూడు రవీంద్ర (నాని) పంచాయితీ చేసినా రాజీ కుదరలేదు. ఈ క్రమంలోనే.. తనకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి భార్యతో కలిసి ఎస్పీకి సుధాకర్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. టీడీపీకి తొలి నుంచి విధేయుడిగా ఉన్న సుధాకర్కే ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మిగతా కేడర్లో భయం మొదలైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గురువారం అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సుధాకర్నాయుడు, ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడ వెళ్లివచ్చారు. ఈ క్రమంలోనే రాత్రి సుధాకర్ నాయుడు అనంతపురం డీఎస్పీని కలవడం చర్చనీయాంశమైంది.
తొలి నుంచీ ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి..
గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అనంతపురం టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా వేరుకుంపటి పెట్టి నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నియోజకవర్గంలో కబ్జాలు, మద్యం వంటి వాటిపై ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్ రాజకీయంగా ఏకాకి అయ్యారని అంటున్నారు. పాలన చేపట్టి ఏడాది గడవకముందే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని టీడీపీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది.
అనంత టీడీపీలో తారస్థాయికి కుమ్ములాటలు
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ముఖ్య నాయకులు
ఇటీవల ‘మినీ మహానాడు’లో
పురుగుల మందు తాగిన వెంకటేశులు
ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని సుధాకర్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు
తొలినుంచీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి
ఎమ్మెల్యే దగ్గుపాటిపై
అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ
సుధాకర్ నాయుడు హత్యకు అదే పార్టీకి చెందిన మరోవర్గం పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. తన వర్గం వారిని కావాలనే వేధిస్తున్నారని సుధాకర్ నాయుడు ఎమ్మెల్యేను ప్రశ్నించడం మొదలు పెట్టడం, వైన్షాపుల వ్యవహారాల్లో తేడా రావడంతో హత్య చేయాలని భావించారనే అనుమనాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఇద్దరు ఈ దురాగతానికి యత్నించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు అడుగడుగునా అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతోనే అతన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. టీడీపీలోనే ఓ వర్గం నాయకుణ్ని మరో వర్గం నాయకులు చంపడానికి యత్నించడమనేది ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

హత్యకు పన్నాగం

హత్యకు పన్నాగం