విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి | - | Sakshi
Sakshi News home page

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి

Jun 6 2025 6:01 AM | Updated on Jun 6 2025 6:01 AM

విత్త

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి

ఆత్మకూరు: విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పంపనూరు రైతు సేవా కేంద్రం వద్ద ఎమ్మెల్యే సునీతతో కలిసి విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విత్తన వేరుశనగ లోడ్‌లను వ్యవసాయ సిబ్బంది తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నాణ్యతగా లేకుంటే వెనక్కు పంపాలని సూచించారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ రైతులు విత్తన వేరుశనగ బస్తాలను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యతగా లేకపోతే వెనక్కిఇవ్వాలని సూచించారు. జిల్లాకు విత్తన వేరుశనగ కేటాయింపు తక్కువగా ఉందని, రైతుల నుంచి డిమాండ్‌ దృష్ట్యా ఎక్కువ విత్తనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్‌డీసీ రామ్మోహన్‌, ఏడీఏ రవి, ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏఈఓ సుజిత పాల్గొన్నారు.

మొక్కలు నాటి సంరక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంపనూరు నగర వనంలో ఎమ్మెల్యే సునీతతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించాలన్నారు. కార్యక్రమంలో సీఎఫ్‌ఓ యశోదబాబు, డీఆర్‌ఓ మలోల, తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పంచివ్వలేదని

తల్లిపై దాడి

పెద్దపప్పూరు: ఆస్తిలో వాటా పంచలేదనే కోపంతో తల్లిపై తనయుడు దాడి చేసిన సంఘటన పెద్దపప్పూరు మండలం గార్లదిన్నెలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గార్లదిన్నెకు చెందిన సరస్వతికి శ్రీకాంత్‌ రెడ్డి, గోపాల్‌, వేణు సంతానం. గురువారం రెండో కుమారుడైన శ్రీకాంత్‌ రెడ్డి తనకు ఆస్తి పంచిలేదంటూ తల్లి సరస్వతితో ఘర్షణకు దిగాడు. తల్లిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

బీటెక్‌ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో బీటెక్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో నిర్వహించిన బీటెక్‌ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ (ఆర్‌–23) రెగ్యులర్‌, (ఆర్‌–20), (ఆర్‌–19), (ఆర్‌–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్‌ (ఆర్‌–23), (ఆర్‌–20), (ఆర్‌–19), (ఆర్‌–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ వి. నాగప్రసాద్‌ నాయుడు గురువారం విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్‌టీయూ (ఏ) వెబ్‌సైట్‌ చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ ఏపీ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నీటి తొట్టెలో పడి

బాలుడి మృతి

పెద్దవడుగూరు: నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిత్రచేడు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిత్రచేడుకు చెందిన అరుణ, ఆనంద్‌ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కుమారుడైన ఏడాదిన్నర వయసున్న అరుణ్‌ దీప్‌ గురువారం ఆడుకొంటూ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. తర్వాత ఎంత సేపటికీ లోపలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు బయటకు రాగా.. నీటి తొట్టెలో అరుణ్‌ దీప్‌ అచేతన స్థితిలో కనిపించాడు. బయటకు తీసి వెంటనే పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అరుణ్‌ దీప్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు.

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి 1
1/2

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి 2
2/2

విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement