
రంగయ్య పాదయాత్రపై కూటమి కుట్రలు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారు. గురువారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామంలో మొదలైన పాదయాత్ర మధ్యాహ్నానికి బొమ్మగానిపల్లి తండాకు చేరుకుంది. అక్కడి నుంచి బొమ్మగానిపల్లి చేరుకుని సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి కొనసాగాల్సి ఉంది.
తమ్ముళ్లను ఉసిగొల్పిన వైనం..
రంగయ్య పాదయాత్ర టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయనయ వర్గీయులకు మింగుడు పడటం లేదు. పాదయాత్రను కొనసాగిస్తే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని భయపడిన వారు యాత్రను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. గురువారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి నుంచి పాదయాత్ర సాగాల్సిన రాయలదొడ్డి రహదారిపై ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. గో బ్యాక్ రంగయ్య అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చేందుకు ఒక్కో బైకుకు రూ.200 పెట్రోల్ వేయించడంతో పాటు క్వార్టర్ బాటిల్ సరఫరా చేసినట్లు తెలిసింది.
భారీగా మోహరించిన పోలీసులు
పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నిన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో బొమ్మగానిపల్లికి చేరుకోవడంతో పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామంలో మోహరించారు. రంగయ్య శాంతియుత పాదయాత్రకు బుధవారం ఆటంకం కలిగించిన పోలీసుల తీరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులూ రావడంతో బొమ్మగానిపల్లిలో సుమారు 8 గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రయాణికులకు కష్టాలు..
మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడానికి వచ్చిన టీడీపీ శ్రేణుల అత్యుత్సాహంతో సామాన్య ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. సాయంత్రం బొమ్మగానిపల్లి మీదుగా బుడిమేపల్లికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సుకు ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు అడ్డంగా బైఠాయించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని అరగంట తర్వాత బస్సును పంపించివేశారు. అదేవిధంగా కన్నేపల్లి, రాయలదొడ్డికి వెళ్లే వాహనదారులను సైతం వదలకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు.
టీడీపీ శ్రేణులను ఉసిగొల్పిన
ఎమ్మెల్యే అమిలినేని వర్గీయులు
బైకుకు రూ.200 పెట్రోల్... ‘తమ్ముళ్ల’కు క్వార్టర్ బాటిల్ సరఫరా
రోడ్డుపై బైఠాయించి హల్చల్ చేసిన ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు

రంగయ్య పాదయాత్రపై కూటమి కుట్రలు