
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనాల్లో శుక్రవారం నిర్వహించనున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన సమావేశ భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన ప్రారంభమవుతాయని వివరించారు. గత సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సంబంధించిన వివరాలపై సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని సూచించారు.
● స్థాయీ సంఘ సమావేశాల్లో ఐసీడీఎస్లో పోషణ్ పక్వాడా నిర్వహణకు మంజూరైన నిధులు రూ.5 లక్షలు ఖర్చు పెట్టకుండా సీడీపీఓలు వాడుకోవడం, ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కార్పొరేట్ హంగులతో కార్యాలయాలు ఉండాలన్న కలెక్టర్ వినోద్కుమార్ ఆశయం మేరకు ఐసీడీఎస్లో రూ.5 కోట్లతో ఆధునికీకరించిన వాటిని ఆర్నెల్లకే పీకి పడేయడంపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. ముంగారు సేద్యాలు మొదలైన కారణంగా ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువుల ఊసే లేకపోవడం, పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల మంజూరు అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించే పరిస్థితి ఉంది. కరోనా మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ పెట్టకపోవడంపైనా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాల సరఫరాతో పాటు ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచే అంశంపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.