ఎవరికెంత ముట్టింది..? | - | Sakshi
Sakshi News home page

ఎవరికెంత ముట్టింది..?

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

ఎవరిక

ఎవరికెంత ముట్టింది..?

● పుట్టపర్తి ప్రవాస భారతీయుడికి చీటింగ్‌ కేసులో పోలీసులపైనా విచారణ!

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసులో నిందితుడి నుంచి భారీగా లబ్ధి పొందిన పోలీసులపైనా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనకు రూ.12 కోట్లకు పైగా మోసం చేశారని మే 22న ప్రవాస భారతీయుడు మహేంద్రకర్‌ ఆర్వీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై పుట్టపర్తి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌ అనంతరం నిందితుడిని అరెస్టు చూప కుండా కొంతమంది టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు అతని ఆస్తులను బదలాయించడం, మరికొన్ని ఆస్తులపై అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులతో పుట్టపర్తి పోలీసులు రూ.50 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ బాగోతమంతా ఒక సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి, కొంతమంది పోలీసుల సమక్షంలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిత్యం సత్యసాయి భక్తులతో కళకళలాడే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలోనే ఇదంతా జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాయ‘బేరం’లో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారికి టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి అండదండలు ఉన్నట్టు తెలు స్తోంది. ఈయన ఏరికోరి సదరు అధికారిని పుట్టపర్తికి తెచ్చుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా డీల్‌ కుదుర్చుకున్న రూ.50 లక్షల్లో ఉన్నతాధికారులకు ఏమైనా వెళ్లిందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విజయవాడకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.

రైతును మింగిన అప్పులు

శెట్టూరు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని యాటకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంభూపాల్‌ తెలిపిన మేరకు... యాటకల్లు గ్రామానికి చెందిన గొల్ల గోవిందప్ప (74) తన మూడెకరాల పొలంలో 8 బోర్లు వేశాడు. చివరి బోరులో నీళ్లు పడ్డాయి. అప్పటికే రూ. 5 లక్షల వరకూ అప్పులయ్యాయి. నీళ్లు పడ్డాయని, పంటలు పెట్టి అప్పులు తీర్చవచ్చనే ఉద్దేశంతో మళ్లీ రూ. లక్ష వరకూ అప్పు చేసి టమాట, వేరుశనగ సాగు చేయగా.. నష్టాలు వచ్చాయి. దీంతో గోవిందప్ప నైరాశ్యంలో కూరుకుపోయాడు. అప్పులెలా తీర్చాలో అంటూ నిత్యం మదనపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పుల విషయం చర్చించి బాధపడ్డాడు. అయితే, కుటుంబసభ్యులు గోవిందప్పకు ధైర్యం చెప్పి పడుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లేచి చూసే సరికి గోవిందప్ప కనపడకపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో అంతా వెతికారు. ఇంటి సమీపంలోని పాడుబడ్డ పెంకుల కొట్టంలో దూలానికి వేలాడుతూ కనిపించిన గోవిందప్పను చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గోవిందప్పకు భార్య గొల్ల మల్లమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: ‘విధి నిర్వహణలో ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సచివాలయ సిబ్బందించి ఆదేశించారు. పింఛను పంపిణీలో ఫీడ్‌బ్యాక్‌పై కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఆర్‌డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజు నాయుడుతో కలిసి సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ముఖ్యంగా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పింఛను లబ్ధిదారుల నుంచి డబ్బు తీసుకోకూడదన్నారు. సిబ్బంది కనిపిస్తేనే లబ్ధిదారులు నమస్కారం చేసేలా ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఎంపీడీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, డీపీఓ, డీఆర్‌డీఏ పీడీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు.

ఎవరికెంత ముట్టింది..? 1
1/1

ఎవరికెంత ముట్టింది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement