
రిలీజ్ డేట్లు తప్ప ఏమీ లేదా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో కేవలం రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తచేతులు చూపుతున్నారు. కనీసం ఒక్క హామీని అమలు చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబులో కన్పించడం లేదు’ అని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిందన్నారు. శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం సమర్పించి, కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలియజేయనున్నట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో విశ్వసనీయత లోపించిందన్నారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు తదితర హామీలను అమలు చేయకపోగా, అమరావతి పేరుతో రూ.1,60,000 కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమేనా అని ప్రశ్నించారు. వెనుకబడ్డ అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ కడప ప్రాంతాలు కన్పించడం లేదా అని విమర్శించారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేశారన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లా వాసులకు ఎంతో మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని చంద్రబాబు అటకెక్కించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీని తామే తీసుకొచ్చామని టీడీపీ చెబుతోందని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోగాతి విజయప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్