ద్రోహులను పార్టీ ఉపేక్షించదు | - | Sakshi
Sakshi News home page

ద్రోహులను పార్టీ ఉపేక్షించదు

Jun 2 2025 1:52 AM | Updated on Jun 2 2025 1:52 AM

ద్రోహ

ద్రోహులను పార్టీ ఉపేక్షించదు

పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ క్రమ శిక్షణ నూతన కమిటీని అధిష్టానం నియమించిందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా తనతో పాటు తానేటి వనిత, రెడ్డిశాంతి, అనిల్‌కుమార్‌ ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు, విధివిధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆశయం మేరకు ప్రజలతో పార్టీ కేడర్‌ ఉండాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచినా, ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న వారిలో పార్టీ మార్పు కోరుతోందని, అయినా వారు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా, ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారన్నారు. బహిష్కరణకు గురైన వారిలో మార్పు రాకుండా అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకత్వంపైన కూడా చర్యలుంటాయన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో

మెరిసిన సోనాక్షి

అనంతపురం: సంయుక్త భారతీయ ఖేల్‌ ఫౌండేషన్‌ (ఎస్‌బీకేఎఫ్‌) ఆధ్వర్యంలో గోవా వేదికగా గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించగా.. రోలర్‌ స్కేటింగ్‌ విభాగంలో జిల్లాకు చెందిన చిన్నారి ప్రతిభ చాటింది. అండర్‌–5 కేటగిరిలో ఏకంగా రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కె.వేణుగోపాల్‌, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షిని ఆమె చదువుతున్న మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆదివారం అభినందించింది.

ప్రభుత్వ పరీక్షల

అసిస్టెంట్‌ కమిషనర్‌ బదిలీ

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం ఉత్తర్వులు రాగా...మధ్యాహ్ననికి ఆయన రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో వైఎస్సార్‌ కడప జిల్లాలో పనిచేస్తున్న వెంకటేశును నియమించారు.

అలాగే డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణయ్య రెండు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. మరో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీ ఉంది. దీంతో ఈ రెండు స్థానాలను అధికారులు భర్తీ చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న మునీర్‌ఖాన్‌, కర్నూలు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఇక్కడికి బదిలీ చేశారు. అలాగే ఇక్కడి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సరళను కర్నూలు డీఈఓ పరిధిలోని పాఠ్యపుస్తకాల విభాగానికి బదిలీ చేశారు.

ప్రమాదంలో వివాహిత మృతి

రాయదుర్గం టౌన్‌: మండలంలోని కదరంపల్లి సమీపంలో చోట చేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ఆవులదట్ల గ్రామానికి చెందిన వివాహిత కవిత(28) ఆదివారం తన సోదరుడు నవీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై గుండ్లపల్లికి బయల్దేరారు. కదరంపల్లి టోల్‌గేట్‌ సమీపంలోకి చేరుకోగానే వెనుకనే ఆర్‌బీ వంక గొల్లలదొడ్డి గ్రామం నుంచి కెంచానపల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివప్ప ఢీకొన్నాడు. ప్రమాదంలో బలమైన గాయమైన కవితను ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. నవీన్‌తో పాటు ప్రమాదానికి కారణమైన శివప్ప, అతని తాత ఉలెప్పకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉలెప్పను అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, మృతురాలు కవితకు భర్త నాగరాజు, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

ద్రోహులను పార్టీ ఉపేక్షించదు 1
1/1

ద్రోహులను పార్టీ ఉపేక్షించదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement