
చౌక దుకాణాల వద్దే రేషన్
● నిస్సహాయులకు ఇంటి వద్దకే పంపిణీ
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డుదారులకు జూన్ నెలకు సంబంధించి బియ్యం, తదితర సరుకులు చౌక ధరల దుకాణాల (స్టోర్) వద్దే పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. 65 ఏళ్ల వయసున్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. చౌక దుకాణాల్లో ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో డీలర్లు కార్డుదారులకు అసౌకర్యం కల్పించినా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైళ్లు సమగ్రంగా సిద్ధం చేయాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: నిషేధిత భూముల జాబితాలో ఉన్న చుక్కల భూములు, 22ఏ భూముల ఫైళ్లను సమగ్ర వివరాలతో సిద్ధం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలోని భూముల ఫైళ్లు సమగ్రంగా లేకపోతే వాటిని పరిష్కరించలేమన్నారు. చెక్లిస్ట్ ప్రకారం అన్ని వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం 22ఏకు సంబంధించి 16 క్లెయిమ్లను, చుక్కల భూములకు సంబంధించి 31 దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవాటిని ఆమోదించారు. వివరాలు సమగ్రమంగా లేని వాటిని పునః పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఆర్బీఎస్కే శ్రీనివాస్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.