
అధికారుల తప్పిదం... విద్యార్థులకు శాపం
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులకు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ హైస్కూల్, బీపీఎస్ (బేసిక్ ప్రైమరీ స్కూల్) విద్యార్థులు బలవుతున్నారు. 117 జీఓ ప్రకారం 3–5 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్ల బోధన అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూల్గా మార్చారు. అయితే,కూటమి ప్రభుత్వం 117 జీఓకు తోసిరాజని పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఇందులో హైస్కూల్+బీపీఎస్ ఒకటి. అబుల్కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ పాఠశాల ఈ కోవలోకి వచ్చింది. ఇక్కడ 1–5 తరగతులను బీపీఎస్గా, 6–10 తరగతులను హైస్కూల్గా విభజించారు.
1,2 తరగతుల విద్యార్థులు మాయం
3,4,5 తరగతుల విద్యార్థులు 20 మంది, 1,2 తరగతుల విద్యార్థులు 14 మంది ఉన్నారు. మొత్తం 34 మంది పిల్లలు ఈ బేసిక్ ప్రైమరీ పాఠశాలలో ఉన్నారు. 21 జీఓ ప్రకారం బీపీఎస్ స్కూళ్లల్లో 1–10 మంది విద్యార్థులకు రెండు ఎస్జీటీ పోస్టులు, 11–30 మంది విద్యార్థులుంటే 3 ఎస్జీటీ పోస్టులు, 31–59 ఉంటే మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు పీఎస్హెచ్ఎం/ఎస్ఏ పోస్టు కేటాయిస్తారు. అయితే, విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్లో 1,2 తరగతుల విద్యార్థులను చూపించలేదు. వారిని మ్యాపింగ్ చేయలేదు. 3–5 తరగతుల విద్యార్థులు 20 మంది ఉంటే 18 మందిని మాత్రమే చూపించారు. వాస్తవానికి ఈ స్కూల్కు మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు ఒక పీఎస్హెచ్ఎం/ఎస్ఏ రావాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా చూపిస్తున్న కారణంగా పీఎస్హెచ్ఎం పోస్టు కోల్పోయారు.
10 రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ...
తమ పాఠశాలకు జరిగిన అన్యాయంపై హెచ్ఎం, కొందరు పది రోజుల నుంచి డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డీఈఓను, టెక్నికల్ విభాగం సిబ్బందిని కలిసి రోజూ వినతిపత్రాలు ఇస్తున్నారు. వారు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సాంకేతిక పరంగా పొరబాటు జరిగిందంటూ పరిష్కారం చూపించలేదని బాధిత టీచర్లు వాపోతున్నారు. వాస్తవానికి 9 మంది దాకా ఉర్దూ ఎస్ఏలు మిగులు టీచర్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ స్కూల్కు ఒకరిని కేటాయిస్తే అటు టీచరుకు, ఇటు విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
అనంతపురం ‘అబుల్ కలాం ఆజాద్’ బీపీఎస్ స్కూల్కు అన్యాయం
విద్యార్థుల లెక్క సరిగా లేకపోవడంతో రద్దయిన పీఎస్హెచ్ఎం పోస్టు
డీఈఓ కార్యాలయం చుట్టూ
తిరుగుతున్న బాధిత టీచర్లు