
సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలపరిచే ఆలోచనతో గ్రామ సచివాలయాలను ప్రవేశపెట్టి ప్రతి శాఖకు చెందిన అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజమైన గ్రామ స్వరాజ్య స్థాపన చేశారని కొనియాడారు. ఉత్తమ సేవలు అందించిన ఆవులెన్న, వ్యాసాపురం, గన్నేవారిపల్లికి చెందిన ముగ్గురు సర్పంచ్లకు, 29 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు గాంధీజీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. కశ్మీర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన 28 మందికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ కార్యాలయ పాలనాధికారి నాగరాజు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ