
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే యోగ
అనకాపల్లి టౌన్: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు యోగాను నేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా విద్యాశాఖ, జిల్లా ఆయుష్ శాఖ సహకారంతో యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో అప్పారావు నాయుడు మాట్లాడుతూ రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. యోగా ప్రాధాన్యతను ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ప్రతిరోజూ ప్రార్థన, డ్రిల్ కార్యక్రమంలో యోగా ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఆయుష్మాన్ అధికారిణి డాక్టర్ కె. లావణ్య మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అనంతరం యోగ గురువులు దొరమ్మనాయుడు, బి.అప్పారావుల ఆధ్వర్యంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో డీఎస్డీవో రమణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోటూరి నాగేశ్వరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి మహలక్ష్మినాయుడు, మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే యోగ