
వీధి కుక్కల దాడిలో ఐదు మేకల మృతి
బుచ్చెయ్యపేట : మండలంలోని వడ్డాది గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 35 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు కురందాసు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కురందాసు నాయుడు శుక్రవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పాకలో మేకలను ఉంచి వచ్చాడు. శనివారం ఉదయం వెళ్లి చూడగా, పాకలో ఐదు మేకలు తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాయి. మేకల ఒంటిపై ఉన్న గాయాలను బట్టి వీధి కుక్కలు దాడి చేసినట్లు గుర్తించాడు. ఇటీవలి కాలంలో వడ్డాది పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. మేకలు, గొర్రెలు, ఆవు, గేదె దూడలతో పాటు నాటు కోళ్లపై కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తూ, ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించి, తమ పశుసంపదను కాపాడాలని పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.