
గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్ : మండలంలోని తండాలదిబ్బ కూడలికి సమీపంలో జంపపాలెం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన నీరు లేని పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఇటీవల ఈ ప్రాంతంలో చొక్కా లేకుండా జీన్స్ ప్యాంటుతో తిరుగుతూ, మతిస్థిమితం లేనట్టు కనిపించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కొందరు స్థానికులు అతని ఫొటోను కూడా తీశారు. ఈ ఫొటో పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎండల తీవ్రతకు ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో పిల్లి గంగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796104, 9440796079 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు.