
బ్రాండిక్స్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
అచ్యుతాపురం రూరల్ : బ్రాండిక్స్ బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం యలమంచిలి మండలం కృష్ణాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందుకుంటున్న మహిళా కార్మికులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రంగా గాయాలైన మహిళా కార్మికులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారన్నారు. మహిళా కార్మికులు గత సంవత్సర కాలం నుంచి బస్సుల ఫిట్నెస్ సరిగ్గా లేదని చెబుతున్నప్పటికీ మూర్ఖంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. స్టీరింగ్ లోపం కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో సుమారు 30 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వేతనంతో కూడిమ సెలవులు మంజూరు చేయాలన్నారు.