
చేతకాక.. కమిషనర్ లేక!
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్థతపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడగా.. కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో సభ రసాభాసగా మారింది. అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ సమావేశ మందిరం మార్మోగింది.
డాబాగార్డెన్స్ (విశాఖ): నూతన మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి.
రెగ్యులర్ కమిషనర్ నియామకం ఎప్పుడు?
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
ఇన్చార్జ్ కమిషనర్ రాకపోవడంతో బ్రేక్
ఇన్చార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందున సమావేశాానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది.
జీరో అవర్ కోసం పట్టు
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్ కావాలని పట్టుబట్టారు. మేయర్ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్ను నియమించేలా చూడాలని సూచించారు.
ఎవడ్రా నువ్వు..!
జీరో అవర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపా హనోక్ మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్కు చురకంటించారు. హనోక్ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు
జీవీఎంసీలో ‘ఘోస్ట్ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్లు నిర్మించాలని పల్లా సూచించారు.
ఎఫ్ఆర్యూ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు
శ్రీహరిపురంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీవీ సురేష్ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు.
ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి
● జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్ పనుల పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు.
● రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్ పునరుద్ధరణ .
● ఇంజినీరింగ్ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు.
ఖాళీగా కమిషనర్ కుర్చీ
మాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాస్
రెగ్యులర్ కమిషనర్ ఎక్కడ అంటూవైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం
జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం
27 అజెండా అంశాలు.. 6 టేబుల్ అజెండా అంశాలు
సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
పీలా గోవిందు హాజరుపై అభ్యంతరం
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు హాజరుపై డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు.

చేతకాక.. కమిషనర్ లేక!

చేతకాక.. కమిషనర్ లేక!