
పరీక్ష తప్పింది విద్యార్థులు కాదు.. కూటమి ప్రభుత్వం
అనకాపల్లి: రాష్ట్ర విద్యాశాఖ వైఫల్యంతో ఎంతోమంది టెన్త్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైందని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ రమాజ్యోతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు, పరీక్ష తప్పిన వారు రీ వాల్యుయేషన్ చేయిస్తే.. అనేకమందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందన్నారు. కచ్చితమైన ఫలితాలు వెల్లడించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో రాత్రీ పగలూ కష్టపడి చదివి పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంతులేని మానసిక క్షోభకు గురయ్యారన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలోనే కూటమి ప్రభుత్వం చేతగానితనం బయటపడిందన్నారు. ప్రశ్నాపత్రాలు వాట్సాప్ వేదికగా లీక్ అయినా తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్కరణలు తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటికి దశల వారీగా మంగళం పాడేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చరణరాజ్, పెందుర్తి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉగ్గిన నాగార్జున, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బోడి వెంకటేష్ యాదవ్, విద్యార్థులు బోలెం హరి హేమంత్, సంతోష్, కిరణ్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు
మొదట ఫెయిలైన వారికి రీ కౌంటింగ్లో అధిక మార్కులు
విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం డిమాండ్