
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
తొలిరోజు 88.39 శాతం హాజరు
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో విద్యాశాఖ మొత్తం 12 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. మొదటి రోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. తొలి రోజు 2,447 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపించగా, వారిలో 88.39 శాతం (2,163 మంది) హాజరయ్యారు. 284 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 7 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,435 మందికి 1,278 మంది (89.06శాతం) హాజరయ్యారు.మధ్యాహ్నం 4 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,012 మందికి 885 మంది (87.45శాతం) హాజరయ్యారు. డీఈవో ఒక కేంద్రాన్ని, పరీక్షల స్క్వాడ్ మూడు కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలు జరిగిన కేంద్రాలలో బుచ్చిరాజుపాలెంలోని ఏడీజెడ్ ఆరోవనా డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో అత్యధికంగా 450 మంది అభ్యర్థులను కేటాయించగా, నగరంలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో అత్యల్పంగా 85 మంది అభ్యర్థులను కేటాయించారు.