
యోగాంధ్ర కు నాడే బీజం
ఈనెల 21న విశాఖ సాగర తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగా దినోత్సవం భారీ ఎత్తున జరగనుంది. ఆ నేపథ్యంలో జిల్లా అంతటా నెల రోజులపాటు ‘యోగాంధ్ర’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, పార్కులు, సాగర తీరాలు, పాఠశాలలు, చివరకు ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాలు.. ఇలా అన్ని చోట్ల యోగాసనాలు వేయిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులతో అభ్యాసం చేయించి, ప్రధాని సమక్షంలో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనేది లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో యోగ శిక్షకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నియమించింది. ‘ఆయుష్’ ద్వారా సంప్రదాయ వైద్యాన్ని విస్తృత పరచి, అందరినీ యోగా వైపు నడిపించాలన్న ప్రయత్నం ఆనాడే ప్రారంభమైంది.
నక్కపల్లి: కోవిడ్ కాటు వేయడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్న రోజులవి.. అల్లోపతి వైద్య విధానంలో సరైన చికిత్స లేక అందరి చూపు ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్యం వైపు మళ్లింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఆయుష్ వైద్యశాలలను బలోపేతం చేసి, వాటికి అనుబంధంగా యోగ విద్యను ప్రచారంలోకి తేవడానికి యోగ శిక్షకులను నియమించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, వేంపాడు ఆయుర్వేద ఆస్పత్రుల పరిధిలో నాటి నుంచి వీరు విశేష సేవలు అందిస్తున్నారు. ఈ శిక్షకుల ద్వారా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు గంటపాటు యోగాసనాలు నేర్పించే కార్యక్రమం చేపట్టారు. తదుపరి గ్రామాల్లో ఆసక్తి చూపిన పెద్దలు, పిల్లలు, మహిళలు, యువతీయువకులకు కూడా యోగాపై అవగాహన కల్పించడంతోపాటు, యోగాసనాలు నేర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆయుర్వేద ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే యోగా శిక్షకులకు గంటకు రూ.250ల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పురుషులయితే నెలకు 32 గంటలు, మహిళలయితే నెలకు 20 గంటలపాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 2021 నుంచి 2024 వరకు నాలుగేళ్లపాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రతి గ్రామంలోను విద్యార్థులతో కలిపి 150 నుంచి 200 మందికి పైగా యోగా నేర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత యోగా శిక్షకులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది.
యోగాంధ్రలో కీలక పాత్ర
యోగాంధ్ర కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ యోగా సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. మే 21 నుంచి ప్రపంచ యోగా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూన్ 21న విశాఖలో ఐదు లక్షల మందితో 45 నిమిషాల సమయంతో కూడిన ప్రొటోకాల్ యోగాను నిర్ణయించారు. సులభశైలిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం గ్రామాల్లో యోగా శిక్షకుల ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీరంతా యోగా కొనసాగింపులో భాగంగా వారి పరిధిలో ఉన్న గ్రామాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజున విశాఖ బీచ్రోడ్డులో యోగాసనాలు వేయాల్సి ఉంటుంది. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నత స్థాయి అధికారులంతా భాగస్వాములవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో మే 27 నుంచి జూన్ 15 వరకు యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు, శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాలుగు టూరిజం ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మే 27న పరవాడ ముత్యాలమ్మపాలెం, జూన్ 2న కేడీపేటలో అల్లూరి సీతారామరాజు పార్క్, 9న రాంబిల్లి తీరప్రాంతం, 15న రేవుపోలవరం సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంతటి బాధ్యతలను మోస్తున్న యోగా శిక్షకులు.. తమ వేతనాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు.
నాలుగేళ్ల క్రితమే యోగ శిక్షకులను
నియమించిన వైఎస్ జగన్ సర్కారు
ఆయుష్ వైద్యశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న శిక్షకులు
నేటి యోగాంధ్ర కార్యక్రమాల్లో
విస్తృత సేవలు

యోగాంధ్ర కు నాడే బీజం

యోగాంధ్ర కు నాడే బీజం