
పీజీఆర్ఎస్.. తూతూమంత్రం.!
● అర్జీల స్వీకరణ సరే.. పరిష్కారమెప్పుడు?
● ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు
● కలెక్టరేట్లో అడుగడుగునా ఆంక్షలు
తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యలు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం తూతూమంత్రంగా సాగుతోంది. కలెక్టరేట్కు వస్తే సమస్యను జిల్లా అధికారులు విని తక్షణమే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ పరిష్కరిస్తారన్న ఆశతోనే జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా వస్తున్న అర్జీదారులకు నిరాశే మిగులుతోంది. జిల్లా అధికారులు సైతం అర్జీ తీసుకుని.. సరే వెళ్లండి అంటున్నారని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రమాదాల్లో గాయాలపాలైన బాధితులు, సంక్షేమ పథకాల కోసం కుటుంబ సభ్యుల సహాయంతో వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. వీరిని గేటు వరకు మాత్రమే సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. మరికొందరు తమ చిన్నారులను తీసుకుని వచ్చినప్పటికి పీజీఆర్ఎస్ వేదిక వద్దకు ఒక్కరికే అనుమతి అంటూ మిగిలిన వారిని బయటకు పంపించేస్తున్నారు. కలెక్టరేట్ బయట రోడ్డు నుంచి అర్జీదారులు బారికేడ్లు దాటుకుని ప్రధాన గేటు వద్దకు రాగా పోలీసులు అర్జీదారుల సంచుల్లో సామగ్రిని తనిఖీ చేసి ఒక్కరినే అనుమతిస్తున్నారు. అడుగడుగున తనిఖీలతో అడ్డంకులు పెట్టి మరి అర్జీదారులను కలెక్టరేట్లోకి పంపిస్తున్నా అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో అర్జీదారులంతా నిరాశతోనే వెనుతిరుగుతున్నారు.
265 అర్జీల స్వీకరణ
కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్తో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారంలో అధికారుల చొరవ చూపకపోవడం వల్లనే అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీల విచారణలో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చేయాలని, పరిష్కరించలేని అర్జీల విషయంలో అర్జీదారులకు స్పష్టత ఇవ్వాలన్నారు. మొత్తం 265 అర్జీలు నమోదయ్యాయి.