
కలిసికట్టుగా కృషి చేస్తే క్షయ రహిత జిల్లా
తుమ్మపాల: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబరులో ‘‘ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ – టీబీ ముక్త్ భారత్ అభియాన్–2025’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని ‘‘నిక్షయ్ మిత్ర‘గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల 4న గ్రామ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి జిల్లా స్థాయి వరకు టి.బి. పరీక్షలు చేయించాలన్నారు. కళ్లె పరీక్ష చేయడం, వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులకు ఎక్స్రే ద్వారా వ్యాధిని గుర్తించవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణ చేసుకుని, క్షయ వ్యాధి లేని దేశంగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. చివరిగా క్షయ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం తదితర సమాచారంతో కూడిన గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.స్.వి.కె. బాలాజీ, డాక్టర్ సి.హెచ్. ధాత్రీప్రియ, వైద్యాధికారి ఎల్. శ్రావణ తదితరులు పాల్గొన్నారు.
‘ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ – టీబీ ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్