
భూకబ్జాదారులకు ఎమ్మెల్యే రాజు అండ
ప్రభుత్వ భూములను ఫోర్జరీ దస్త్రాలతో రూ.4 కోట్లకు విక్రయించేయడంతో పాటు మరో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ముఠాపై విచారణ చేపట్టాలని రావికమతం మండలం తోటకూరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త యడ్ల చినసత్తిబాబు పీజీఆర్ఎస్లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అచ్చుతాపురం మండలం నునపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో ప్రభుత్వ భూములను బినామీల పేరున తప్పుడు పాసు పుస్తకాలు తయారు చేసి భూకబ్జాలను పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నించిన తనతో పాటు కుటుంబ సభ్యులపై పోలీసు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత, చోడవరం ఎమ్మెల్యే రాజుకు చెప్పినా వారు పట్టించుకోకుండా.. ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని, వారి ఆదేశాలతోనే తనపై కేసులు నమోదయ్యాయన్నారు. గ్రామంలో సర్వే నంబర్ 3లో ప్రైవేటు భూమితో పాటు సర్వే నంబర్ 2, 4లో ప్రభుత్వ భూమి 30 ఎకరాలు, కశింకోట మండలం అడ్డాం గ్రామంలో కూడా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.