
మునగపాక: మండలంలోని కుమారపురంలో అప్పులు తీర్చలేక క్రిమిసంహారక మందు తాగి రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం విశాఖ కేజీహెచ్లో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని కుమారపురం గ్రామానికి చెందిన పల్లెల సూరిబాబు(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులకు గాను రూ.5 లక్షలు, తన చిన్న కుమారుడు శ్రీనివాస్ కోసం దస్తావేజులు తనఖా పెట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి మరో రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వీటిని తీర్చే మార్గం లేక నిత్యం మద్యానికి బానిసై వడ్డీ చెల్లించే పరిస్థితులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు.
దీనిలో భాగంగా గత నెల 28న సాయంత్రం క్రిమిసంహారక మందు తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కుమారుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.