
పింఛన్ల పంపిణీ ప్రారంభం
కశింకోట/నక్కపల్లి: సామాజిక పింఛన్ల పంపిణీని హోం మంత్రి నక్కపల్లి మండలం ఉద్దండపురంలో, కలెక్టర్ కశింకోటలో శనివారం ప్రారంభించారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్దండపురంలో మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే శనివారం నుంచి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. మంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించారు. వారి ఇంట్లో స్వయంగా టీ తయారు చేసి అందరికీ ఇచ్చారు. కలెక్టర్ విజయ కృష్ణన్ కశింకోటలోని గవరపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నడవడానికి సహకరించక మంచానికే చాలా కాలంగా పరిమితమై ఉన్న తనకు వితంతు పింఛన్ స్థానంలో వికలాంగ పింఛన్ అందివ్వడానికి చర్యలు తీసుకోవాలని బాధితురాలు సూరిశెట్టి లక్ష్మీమణి విన్నవించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. డీఆర్డీఏ పీడీ శచీదేవి, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, ఎంపీడీవో వి.వి.రవికుమార్, తహసీల్దార్ జి.సత్యనారాయణ పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ ప్రారంభం