
విద్యుత్ లైన్ ఏర్పాటులో ఉద్రిక్తత
పెదపూడిలో అధికార పార్టీ కుట్ర ●సాక్షి కథనానికి స్పందించిన అధికారులు
బుచ్చెయ్యపేట: మండలంలోని పెదపూడిలో విద్యుత్ లైన్ ఏర్పాటులో ఉద్రిక్తత ఏర్పడింది. ఐదు గ్రామాలకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా కోసం రోడ్డుకు ఎడమ వైపు విద్యుత్ లైన్ వేయగా, పెద్దపూడిలో మాత్రం అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా చెట్లను తొలగించడానికి కుడి వైపునకు మార్చాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో మళ్లీ పనులు ఆగిపోయాయి. అంధకారంలో 5 గ్రామాలు అనే శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం విద్యుత్ లైన్ కలపడానికి యంత్ర పరికరాలతో పెదపూడి వచ్చారు. సీతయ్యపేట నుంచి పెదపూడి, ఫంగిడి, ఎస్ఎల్నగర్, ఉప్పరగూడెం, చిన్నయ్యపాలెం గ్రా మాలకు విద్యుత్ స్తంభాలు, వైర్లు ఆరు నెలల క్రితమే వేశారు. పెదపూడి దగ్గరలో రెండు విద్యుత్ స్తంభాలను మాత్రం రోడ్డుకు అవతల(కుడి) వైపు మార్పు చేయాలని గ్రామానికి చెందిన ఒకరిద్దరూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వందల ఏళ్ల నాటి చెట్లను తొలగించడానికి వారు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల వేసిన రెండు విద్యుత్ స్తంభాలను తీసి భారీ చెట్లు ఉన్న రోడ్డుకు అవతలవైపు మార్పు చేయాల్సిన అవసరమేంటని ఆగ్రహించారు. యంత్ర పరికరాలు పనులు చేయకుండా సర్పంచ్ గోకివాడ వరకృష్ణ, గ్రామస్తులు గోకివాడ నాయుడు, సాయి, నారాయణ, వీరునాయుడు, చిరంజీవి, బొట్టా శివ, ఆలేటి రామకృష్ణ, వియ్యపు సోమునాయుడు, రామునాయుడు, మీసాల అప్పారావు, మీసాల నూకరాజు, గోకివాడ దేముడు, రమణ, వియ్యపు ప్రవీణ్, కుంచం శివప్రసాద్, లాలం గంగరాజు, పోలిరెడ్డి దేముడు, కిల్లాడ బుల్లిబాబు, సాగిరాజు సన్యాశిరాజు, వర్మ తదితర గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారు తప్ప నిబంధనలు పాటించడం లేదని మండిపడ్డారు. గతంలో వేసిన విద్యుత్ స్తంభాలకే వైర్లు బిగించి కరెంట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దాంతో సిబ్బంది చేసేది లేక యంత్రాలతో వెనుదిరిగారు.

విద్యుత్ లైన్ ఏర్పాటులో ఉద్రిక్తత