
మైరెన్ పరిశ్రమ కార్మికురాలి అనుమానాస్పద మృతి
ఎస్.రాయవరం : సాయి మైరెన్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికుల్లో ఆందోళన రేకెత్తింది. సుమారు 5 వందలకు పైగా కార్మికులు పని చేసే ఈ పరిశ్రమలో ప్రాథమిక స్థాయిలో వైద్యం అందివ్వకపోవడం, 10 కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేసరికి 19 ఏళ్ల యువతి మృత్యవాత పడడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతానికి చెందిన హులకా అనిత (19) కొన్ని నెలలుగా పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చి, ఇదే పరిశ్రమలో ఉన్న హాస్టల్లో ఉంటున్నది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనితకు పరిశ్రమ యాజమాన్యం కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందివ్వకపోవవడంతో బుధవారం రాత్రి మృతి చెంది ఉంటుందని ప్రజా సంఘాల నాయకుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. కాగా ఆమె అనారోగ్యమా, ఇతర కారణాలతో మృతి చెందిందా? అనే విషయాలు తెలియడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా పోస్టుమార్టం చేయాలని విశాఖపట్నం కేజీహెచ్కి మృతదేహాన్ని తరలించినట్టు అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులు ఒడిశా రాష్ట్రం నుంచి రావాల్సి ఉండగా సాయంత్రానికి ఫిర్యాదు రాలేదని, వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. ఈ విషయం గురువారం పరిశ్రమ పరిసర ప్రాంతాల వారికి తెలియడంతో కొందరు మీడియావారు, ప్రజాసంఘాల నాయకులు పరిశ్రమలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పరిశ్రమ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకపోవడంతో స్థానికులు తహసీల్దార్ రమేష్బాబుకి ఫోన్లో సమాచారం అందించారు. తహసీల్దార్ ఆర్ఐ మణికంఠను వివరాలు తెలుసుకుని నివేదిక తీసుకురావాలని ఆదేశించడంతో ఆర్ఐ మణికంఠ పరిశ్రమలో విచారణ చేపట్టారు. జ్వరం ఎక్కువగా వచ్చిందని ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి చనిపోయినట్టు చెప్పారన్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికురాలిమృతి : సీపీసీ నేతల ఆరోపణ
సాయి మైరెన్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికురాలు అనిత మృతి చెందిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. బుధవారం రాత్రి సమయంలో కంపెనీలో మృతి చెందిన అనితను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పారన్నారు. అనిత మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 1979 వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మైరెన్ పరిశ్రమ కార్మికురాలి అనుమానాస్పద మృతి

మైరెన్ పరిశ్రమ కార్మికురాలి అనుమానాస్పద మృతి