యాంత్రీకరణ సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

యాంత్రీకరణ సాగు లాభదాయకం

May 30 2025 1:29 AM | Updated on May 30 2025 1:29 AM

యాంత్రీకరణ సాగు లాభదాయకం

యాంత్రీకరణ సాగు లాభదాయకం

కశింకోట: ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు కోరారు. యాంత్రీకరణతో వ్యవసాయం చేపట్టడం ద్వారా పని వేగం కావడంతోపాటు ఖర్చు తగ్గుతుందన్నారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖల సహకారంతో వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సాగుకు సంబంధించి సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా రైతులకందించే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి. ప్రభాకరరావు మాట్లాడుతూ ఖరీఫ్‌లో మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుందన్నారు. పండ్ల తోటల పెంపకం, ఇతర ఉద్యాన వన పంటల వైపు రైతులు చొరవ చూపాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ గౌరి మాట్లాడుతూ చెరకు సాగులో విత్తన శుద్ధి చేసుకొని నాటాలన్నారు. పంట మార్పిడి చేస్తుండటం వల్ల ఎర్రకుళ్లు, పశుపాకు తెగుళ్లు నివారించవచ్చునన్నారు. బెల్లం తయారీలో అనారోగ్య కారక మందులు వినియోగించొద్దన్నారు. జిల్లా రిసోర్స్‌ కేంద్రం అధికారులు సీహెచ్‌. సుబ్రహ్మణ్యం, పి. శ్రీధర్‌ పంటల సాగులో రైతులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఏవో ఎం. స్పప్న మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. బీసీటీ కేంద్రం భూసార శాస్త్రవేత్త మట్టి పరీక్షలు ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి రాజ్ని, కశింకోట, వెదురుపర్తి, తేగాడ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహనరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement