
‘ఉపాధి’ బకాయిలు చెల్లించండి మహాప్రభో.!
రోలుగుంట: ఉపాధి వేతన బకాయిలు తక్షణం చెల్లించాలంటూ మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ శివారు లోసింగి, పనసలపాడు గ్రామాల్లో కూలీలు బుధవారం ఖాళీ క్యారేజీలతో వినూత్న నిరసన తెలిపారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోవిందరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ.8,500 కోట్ల మేర బకాయిలున్నాయన్నారు. దీంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని వేసవి సమయంలో ఉపాధి పథకం పనులపై ఆధారపడిన పేదల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పథకం నిబంధనల మేరకు జరిగిన పనులకు 15 రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో పీడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.