
తీరని భూ దాహం
● బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూ సేకరణ ● పెదతీనార్లలో 518,సీహెచ్ఎల్ పురంలో 198 ఎకరాలు ● రైతులతో అధికారుల మంతనాలు ● నేరుగా కొనుగోలుకు యత్నాలు ● ఎకరాకు రూ.37 లక్షలు ఇస్తామని బేరాలు ● ససేమిరా అంటున్న రైతులు
నక్కపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదు. బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ చేస్తోంది. పోనీ పరిహారం విషయంలో న్యాయం చేస్తోందా అంటే అదీ లేదు. నోటిఫికేషన్ లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచే కొని వారి నోట్లో మట్టి కొట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. బుధవారం ఏపీఐఐసీ అధికారులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వెల్లడైంది. తక్కువ భూమి సేకరించే గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఎక్కువ భూములు అవసరమైన చోట నేరుగా రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డైరెక్ట్ పర్చేజ్ అయితే రైతులకు నష్టపరిహారం తప్ప ఇతర ప్యాకేజీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం సీహెచ్ఎల్ పురం రెవెన్యూ పరిధిలో 198 ఎకరాలు, పెదతీనార్ల రెవెన్యూ పరిధిలో 518 ఎకరాలు భూములు కావాల్సి ఉంది. తక్కువ భూ మి ఉన్న సీహెచ్ఎల్ పురంలో భూసేకరణ కోసం తాజాగా 4 (1) నోటిఫికేషన్ విడుదల చేశారు. 500 ఎకరాలు దాటి అవసరమున్న పెదతీనార్లలో మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా కొనుగోళ్ల పేరుతో రైతులతో మంతనాలు జరుపుతున్నారు. బల్క్డ్రగ్ పార్క్ కోసం సరిపడా భూములను గత ప్రభుత్వం కేటాయించింది. కూటమి ప్రభుత్వం పార్క్ విస్తరణ పేరుతో అదనంగా భూములు సేకరించడం పట్ల ఆయా గ్రామాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా యి. ఏపీఐఐసీ ద్వారా మండలంలో వేంపాడు, చందనాడ, అమలాపురం, డీఎల్ పురం, రాజయ్యపేట ల్లో ప్రభుత్వం 4500 ఎకరాలు సేకరించిన విష యం తెలిసిందే. వీటిలో గత ప్రభుత్వం 2 వేల ఎకరాలు బల్క్డ్రగ్ పార్క్కు కేటాయించింది. మిగిలిన భూములను కూటమి ప్రభు త్వం తాజాగా తెర మీదకు వచ్చిన ఆర్సిలర్ మిట్టన్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు ఆగమేఘాల మీద కట్టబెట్టింది.
రైతుల నుంచి వ్యతిరేకత
బల్క్డ్రగ్ పార్క్కు సరిపడ భూములు కేటాయించినప్పటికీ పార్క్ విస్తరణ పేరుతో జానకయ్యపేట, సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాల్లో మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బల్క్డ్రగ్ పార్క్లో చిన్న చిన్న యూనిట్లు స్థాపించే పారిశ్రామికవేత్తల కోసమే తమ నుంచి అదనంగా భూములు సేకరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. తాజాగా బుధవారం పెదతీనార్ల గ్రామస్తులతో ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో 518 ఎకరాల భూమి అవసరమవుతోందని, బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనంగా సేకరిస్తున్నామని, నేరుగా కొనుగోళ్ల పేరుతో భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామాల్లో మార్కెట్ విలువ ఎకరా రూ.15 లక్షలు ఉందని, దానిని రెట్టింపు చేసి, ఫలసాయంతో కలిపి ఎకరాకు రూ.37 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, భూములు ఇవ్వాలని కోరారు. పెదతీనార్లలో 20 నుంచి 50 ఎకరాల భూములు కలిగిన భూస్వాములు ఎకరాకు రూ.60 లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీనిపై వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి కొంతమంది రైతులతో కలసి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరు మాట్లాడుతూ పెద్ద రైతులను దృష్టిలో పెట్టుకుని భూముల ధర నిర్ణయించడానికి వీల్లేదన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవించే వారికి 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, మేజర్లకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏర్పాటయిన రసాయన పరిశ్రమల వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. జానకయ్యపేట, చినతీనార్లలో రైతులు కూడా బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇవ్వమంటూ నిరసన తెలియజేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే 4 (1) నోటిఫికేషన్ విడుదల చేసి 2013 భూసేకరణ చట్టప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారికి కూడా న్యాయం చేయాలన్నారు.

తీరని భూ దాహం